enforcement special derector: దర్యాప్తు అధికారి అకారణ బదిలీ ఎఫెక్ట్‌.. ఈడీ స్పెషల్‌ డైరెక్టర్‌ వినీత్‌ అగర్వాల్‌పై వేటు

  • సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
  • వినీత్‌ తీసుకున్న బదిలీ నిర్ణయం రద్దు
  • మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్‌ అధికారి వినీత్

కీలక కేసును దర్యాప్తు చేస్తున్న అధికారిని అకారణంగా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్పెషల్‌ డైరెక్టర్‌ వినీత్‌ అగర్వాల్‌పై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను మాతృ సంస్థకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

వివరాల్లోకి వెళితే...ఆర్థిక నేరస్తులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ కేసుల్ని పరిశీలిస్తున్న ఈడీ జేడీ సత్యబ్రత్‌కుమార్‌ను పదిహేను రోజుల క్రితం వినీత్‌ అగర్వాల్‌ బదిలీ చేశారు. కేసు దర్యాప్తు పనిపై సత్యబ్రత్‌ లండన్‌లో ఉండగానే ఆయన ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.

దీనిపై వెంటనే స్పందించిన ఈడీ డైరెక్టర్‌ సంజయ్‌ మిశ్రా ఆ బదిలీని రద్దుచేస్తూ ఇటువంటి నిర్ణయం తీసుకునే అధికారం వినీత్‌కు లేదని స్పష్టం చేశారు. అలాగే, వినీత్‌ను సొంత క్యాడర్‌కు పంపాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ఈ ప్రతిపాదనకు మంగళవారం ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

1994 ఐపీఎస్‌ బ్యాచ్‌ మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన వినీత్‌ అగర్వాల్‌ ముంబయి ఈడీ స్పెషల్‌ డైరెక్టర్‌గా పని చేసిన కాలంలో మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, చత్తిస్‌గడ్‌ రాష్ట్రాల్లో కార్యకలాపాలు చూసేవారు. 2017 జనవరిలో ఆయనను ఈడీ స్పెషల్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉండాల్సి ఉండగా, మధ్యలోనే బదిలీ వేటు పడింది. 

More Telugu News