rajyavardhan singh rathore: అర కిలోమీటరు నడిచి.. ప్రాణాయామం చేసి నామినేషన్ వేసిన కేంద్రమంత్రి

  • కలెక్టరేట్‌లో రాందేవ్ బాబాతో కలిసి ప్రాణాయామం
  • రాజకీయ నాయకులకు యోగా అవసరమన్న బాబా
  • దేశం సరైన నాయకుడి చేతిలో ఉందన్న రాథోడ్

కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మంగళవారం జైపూర్‌లో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు అర కిలోమీటరు దూరం నడిచి కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయన అక్కడ ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సూచనతో, ఆయనతో కలిసి ప్రాణాయామం చేసిన అనంతరం నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రాందేవ్ బాబా మాట్లాడుతూ.. ఇక్కడ ప్రాణాయామం చేయడంపై ఈసీకి ఎవరూ ఫిర్యాదు చేయరని చమత్కరించారు. రాజకీయాల్లో దిగేవారికి యోగా చాలా అవసరమన్న బాబా.. ప్రజలు యోగా చేయకపోవడమే రాజకీయ అస్థిరతకు కారణమన్నారు.

నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాథోడ్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే దేశం అభివృద్ధి చెందలేదన్నారు. ప్రస్తుతం దేశం సరైన నాయకుడి చేతిలో ఉందన్నారు. కాగా, నామినేషన్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కిడోడి లాల్ మీనా, మాజీ ఎమ్మెల్యే రాజేంద్రసింగ్ పాల్గొన్నారు.

More Telugu News