Supreme Court: శబరిమల ఆలయం కేసులో తీర్పు ఇచ్చిన కారణంగానే ఈ పిటీషన్ ను విచారణకి స్వీకరించాం: సుప్రీంకోర్టు

  • మసీదుల్లోకి ముస్లిం మహిళలను అనుమతించండి
  • లింగ వివక్ష కారణంగా మహిళలపై నిషేధం తగదు
  •  కెనడా .. మక్కాలో మసీదుల్లోకి ముస్లిం మహిళలను అనుమతిస్తున్నారన్న పిటిషనర్లు      

మతపరమైన విషయాల్లో తమ మనోభావాలు దెబ్బతింటున్నాయనీ .. లింగ వివక్ష కారణంగా తమ స్వేచ్చ .. స్వాతంత్ర్యాలు  హరించబడుతున్నాయని న్యాయస్థానాన్ని ఆశ్రయించే మహిళల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మసీదుల్లోకి ముస్లిం మహిళలు రాకుండా ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలనీ, ముస్లిం మహిళలు మసీదుల్లో ప్రార్థనలు జరుపుకునేలా అనుమతిని ఇవ్వాలని కోరుతూ పూణెకి చెందిన దంపతులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశానికి చట్ట బద్ధంగా అనుమతించాలని కోరుతూ దాఖలైన ఈ పిటీషన్ ను సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించింది. ఈ విషయంపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం, ఏ దేశంలోనైనా సరే మసీదుల్లోకి ముస్లిం మహిళలను అనుమతిస్తున్నారా? అని పిటీషనర్ల తరఫు న్యాయవాదులను అడిగింది.

కెనడా .. మక్కాల్లో అనుమతిస్తున్నారని వారు సమాధానమివ్వడంతో, ఈ పిటీషన్ పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేసులో తీర్పు ఇచ్చినందువల్లనే ఈ పిటీషన్ ను కూడా స్వీకరించినట్టు జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

More Telugu News