Hyderabad: తెలిసిన వ్యక్తే కదా అని నమ్మి వెళ్తే.. స్నేహితులతో కలిసి అత్యాచారం

  • హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఘటన
  • ఓ పని విషయమై మాట్లాడేందుకు వెళ్లిన మహిళ
  • మద్యం మత్తులో స్నేహితులతో కలిసి అత్యాచారం

తనను కలవాలంటూ తెలిసిన వ్యక్తి పిలిస్తే వెళ్లిన మహిళపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుపై సోమవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం..

కొత్తపేటకు చెందిన బాధిత మహిళ (32)కు ఐదేళ్ల క్రితం వివాహం కాగా, భర్తతో మనస్పర్థల కారణంగా రెండేళ్ల క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. వనస్థలిపురంలోని మ్యాక్స్‌లైన్ పాలసీ సంస్థలో పనిచేస్తూ జీవిస్తోంది. మన్సూరాబాద్‌కు చెందిన మనోజ్‌కుమార్ ‌(30) ఆరు నెలల క్రితం బాధిత మహిళకు పరిచయం అయ్యాడు. ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలున్న మనోజ్‌కు శనివారం మధ్యాహ్నం ఫోన్ చేసి ఓ విషయమై మాట్లాడాల్సి ఉందని చెప్పింది.

తాను వనస్థలిపురంలోని స్నేహమయనగర్‌లో స్నేహితుల వద్ద ఉన్నానని, అక్కడికి వస్తే మాట్లాడుకోవచ్చని చెప్పాడు. దీంతో సరేనని అక్కడికి వెళ్లిన మహిళపై అప్పటికే మద్యం మత్తులో ఉన్న మనోజ్ స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధిత మహిళ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మనోజ్ మరో ఐదుగురితో కలిసి తనపై అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News