Andhra Pradesh: రాజమండ్రి అల్లు రామలింగయ్య హోమియో కాలేజీలో విద్యార్థుల ఆందోళన!

  • పరీక్షలు రద్దు చేసి మళ్లీ చేపట్టాలని డిమాండ్
  • ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం
  • ఆరుగురు విద్యార్థులు ఛాన్స్ కోల్పోయారని ఆవేదన

ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి(రాజమహేంద్రవరం)లో ఉన్న అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాల విద్యార్థులు ఈరోజు ఆందోళనకు దిగారు. కళాశాల నిర్వహిస్తున్న పరీక్షలను మూకుమ్మడిగా బహిష్కరించారు. కళాశాల అధికారుల నిర్వాకం కారణంగా ఆరుగురు విద్యార్థులు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయమై ఓ విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షలకు కళాశాల యాజమాన్యం విద్యార్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఎలాంటి నోటీసులు లేకుండా హఠాత్తుగా పరీక్షలు నిర్వహించడంతో గత శనివారం ఆరుగురు విద్యార్థులు హాజరుకాలేకపోయారని వ్యాఖ్యానించారు.

ఈ పరీక్షలను రద్దుచేసి మళ్లీ అందరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కళాశాల యాజమాన్యం భారీగా పోలీసులను మోహరించింది. దీంతో ఇక్కడ టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది.

More Telugu News