India: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నోట ‘పాకిస్థాన్’ పాట.. దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు!

  • పాక్ ఆర్మీ పాటను కాపీకొట్టిన రాజాసింగ్
  • హిందుస్థాన్ జిందాబాద్ అంటూ కొత్త భాష్యం
  • సోషల్ మీడియాలో మొదలైన ట్రోలింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కొత్త తలనొప్పిని కొనితెచ్చుకున్నారు. ఇటీవల ఆయన ‘దిల్ కీ ఆవాజ్.. హర్ దిల్ కీ ఆవాజ్.. హిందుస్థాన్ జిందాబాద్’ అనే పాటను స్వయంగా ఆలపించారు. ఈ గీతాన్ని శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేశారు. దీన్ని భారత సైన్యానికి అంకితం ఇస్తున్నట్లు రాజాసింగ్ ప్రకటించారు. అయితే ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఒకటుంది.

ఈ పాట విడుదలైన వెంటనే తమ ఆర్మీకి చెందిన ఈ పాటను రాజాసింగ్ కాపీ కొట్టారని పాకిస్థాన్ ఆరోపించింది. రాజాసింగ్ రూపొందించిన పాట ‘‘దిల్ కీ ఆవాజ్.. హర్ దిల్ కీ ఆవాజ్.. పాకిస్థాన్ జిందాబాద్’ను మార్చి రాసిందేనని స్పష్టం చేసింది. ఈ పాటను పాక్ రచయిత సహిర్ అలీ బగ్గా రాశారని పేర్కొంది. ఈ విషయమై పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ గఫూర్ స్పందిస్తూ..‘ఈ పాటను కాపీ చేసినందుకు సంతోషం. కానీ కాపీకి సంబంధించిన వివరాలు కూడా బయటపెట్టాలి కదా!’ అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా రాజాసింగ్ పాడిన పాటను, అసలు పాటను పోస్ట్ చేశారు. మరోవైపు రాజాసింగ్ నిర్వాకంపై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పాక్ పాటను, రాజాసింగ్ పాటను పోస్ట్ చేసి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి.

More Telugu News