Mumbai: వీధి కుక్కలకు ఆహారం పెట్టాడని... రూ. 3.60 లక్షల జరిమానా విధించిన హౌసింగ్ సొసైటీ!

  • ముంబైలోని ఖాండీవాలీలో ఘటన
  • జరిమానా విధించిన నిసర్గ్ హెవెన్ సొసైటీ
  • జంతు హక్కులకు భంగం కాదన్న సొసైటీ చైర్మన్

రోడ్డుపై వెళ్లే కుక్కలకు ఆహారం పెట్టాడన్న కారణంతో ఓ అపార్టుమెంట్ నివాసిపై రూ. 3.60 లక్షల జరిమానా విధించిందో హౌసింగ్ సొసైటీ. ఈ ఘటన ముంబైలోని ఖాండివాలీ ప్రాంతంలోని నిసర్గ్ హెవెన్ సొసైటీలో జరిగింది. సొసైటీ నివాసి అయిన జంతుప్రేమికుడు ఒకరు, సొసైటీ పరిసరాల్లో శునకాలకు ఆహారం పెట్టాడని ఆరోపించిన సొసైటీ చైర్మన్ మితీశ్ బోరా, ఈ జరిమానా విధించారు.

"సొసైటీ సభ్యుల్లో 98 శాతం మంది వీధి కుక్కలకు సొసైటీ పరిసరాల్లో తిండి పెడితే, జరిమానా విధించాలని తీర్మానించారు. సొసైటీ చైర్మన్ గా నా డ్యూటీ నేను చేశాను. వీధి కుక్కలకు బయట ఆహారం పెడితే ఎటువంటి అభ్యంతరం లేదు. మేము కూడా జంతు ప్రేమికులమే. ఇక్కడ జంతు హక్కుల మాటే రాదు. మానవ హక్కుల ఉల్లంఘనా లేదు" అని మితీశ్ అంటున్నారు.

ఈ ప్రాంతంలో వీధి కుక్కలు వృద్ధులు, చిన్నారులతో పాటు ఎంతో మందిని కరుస్తున్నాయని, పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నాయని, సొసైటీ సభ్యుల నుంచి ఎన్నో ఫిర్యాదులు రావడంతోనే ఈ జరిమానా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాగా, ఈ సొసైటీలో కుక్కలకు తిండి పెట్టేవారికి జరిమానా విధించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలువురికి సొసైటీ జరిమానా విధించింది. అయితే, ఇది గతంలో రూ. 2,500, రూ. 7,500 ఉండేది. ఆపై దీన్ని భారీగా పెంచారు.

More Telugu News