Jayaprada: ఆమె శరీరాన్ని తాకకుండా జాగ్రత్తలు తీసుకున్నా... జయప్రదపై ఆజంఖాన్ దిగజారుడు వ్యాఖ్యలు!

  • జయప్రదను రామ్ పూర్ కు నేనే తెచ్చా
  • ఆమెనెలా కాపాడానో ప్రజలకు తెలుసు
  • ఇప్పుడు ఖాకీ నిక్కర్ వేసుకుందని వ్యాఖ్య
  • నోటీసులు పంపిస్తామన్న జాతీయ మహిళా కమిషన్

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల మంటలు సెగలు పుట్టిస్తున్నాయి. యూపీలోని రామ్ పూర్ నుంచి సమాజ్ వాదీ తరఫున పోటీ చేస్తున్న ఆజంఖాన్, బీజేపీ అభ్యర్థి జయప్రదల మధ్య ఈ యుద్ధం మరింతగా జరుగుతోంది. ఒకరిపై ఒకరు దారుణ విమర్శలు చేసుకుంటున్న వేళ, మరో దిగజారుడు వ్యాఖ్య వినిపించింది. జయప్రదను తానే రామ్ పూర్ కు తీసుకు వచ్చానని, ఆమె శరీరాన్ని ఎవరూ తాకకుండా జాగ్రత్తలు తీసుకున్నానని తాజాగా ఆజంఖాన్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది.

 ఆమెను తానెలా కాపాడానో ప్రజలకు తెలుసునని అన్నారు. ఆమె నిజ స్వరూపం తెలుసుకునేందుకు ఓటర్లకు 17 సంవత్సరాల సమయం పట్టిందని అన్నారు. ఆమె ఇప్పుడు ఖాకీ నిక్కర్ వేసుకుందని విమర్శలు గుప్పించారు. ఇక ఆజంఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ వ్యాఖ్యానించారు. ఆయన మాటలు అవమానకరమైనవని, ఆయనకు నోటీసులు పంపించనున్నామని, ఈ ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కోరనున్నామని ఆమె అన్నారు.

More Telugu News