GVL Narasimha rao: ఈవీఎంల పనితీరును ఎండగడుతూ నాడు పెద్ద పుస్తకం రాసిన బీజేపీ నేత జీవీఎల్!

  • ‘‘డెమోక్రసీ ఎట్ రిస్క్ డ్యూ టు ఈవీఎమ్స్’ పేరుతో 230 పేజీల పుస్తకం
  • ముందుమాట రాసిన అద్వానీ
  • ఇప్పుడు చంద్రబాబుపై విమర్శలు 

ఈవీఎంల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ నేతలు ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఈవీఎంల పనితీరు చాలా ప్రమాదకరంగా మారిందని, వాటివల్ల ప్రజాస్వామ్యానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ గతంలో జీవీఎల్ రాసిన పుస్తకం ఒకటి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ‘డెమోక్రసీ ఎట్ రిస్క్ డ్యూ టు ఈవీఎమ్స్’ పేరుతో వచ్చిన ఈ పుస్తకానికి ఎల్‌కే అద్వానీ ముందుమాట రాశారు.  

230 పేజీలున్న ఈ పుస్తకంలో వివిధ దేశాల్లోని ఘటనలను ఉదహరించారు. అప్పట్లోనే చంద్రబాబు ఈవీఎం పద్ధతిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడూ చేస్తున్నారు. కానీ ఈవీఎంల వల్ల ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఏర్పడిందంటూ అంత పెద్ద పుస్తకం రాసిన జీవీఎల్ మాత్రం మాట మార్చారు. ఈవీఎంల పనితీరు భేష్ అంటూ కొనియాడుతుండడంపై నెటిజన్లు దుయ్యబడుతున్నారు. అప్పట్లో ఒడిశా ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసినా బీజేడీకే పడుతున్నాయని, ఎన్నికలవగానే పోలింగ్ 52.6 శాతం నమోదైందని అధికారికంగా ప్రకటించారని, తీరా కౌంటింగ్ నాటికి అది 65.9 శాతానికి చేరిందని ఆ పుస్తకంలో జీవీఎల్ ప్రస్తావించారు.

అలాగే, ఈవీఎంల పనితీరును నిరసిస్తూ తమిళనాడులో జయలలిత ఐదు అసెంబ్లీ ఉప ఎన్నికలను బహిష్కరించిన విషయాన్ని కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించారు. నోయిడాలో ఓ పోలింగ్ బూత్‌లో మొత్తం 417 ఓట్లు పోలయితే 415 ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థికే వచ్చాయని పేర్కొన్నారు. అలాగే, ఏపీతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో తలెత్తిన ఈవీఎం లోపాలను కూడా రాసుకొచ్చారు. వివిధ పార్టీల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. అమెరికా, బ్రెజిల్‌ వంటి దేశాల్లోనూ ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని వివరించారు.

More Telugu News