Virat Kohli: ఆరు ఓటముల తర్వాత గెలుపును భార్యకు ఆపాదించిన కోహ్లీ

  • కష్టకాలంలో అనుష్క వెంట నిలిచింది
  • ఒత్తిడి సమయాల్లో ఎంతో ప్రోత్సహించేది
  • ఆమె వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది

వరుసగా ఆరు మ్యాచ్ లలో ఓటమిపాలైన జట్టు ఏడో మ్యాచ్ లో ఎంత ఒత్తిడి ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ స్థయిర్యానికి అగ్నిపరీక్ష అని చెప్పాలి. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే అపురూపం అనదగ్గ విజయం సాధించి ఊపిరి పీల్చుకున్నాడు విరాట్ కోహ్లీ.

టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కోహ్లీ, ఐపీఎల్ తాజా సీజన్ లో తాను సారథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తొలి 6 మ్యాచ్ లలో ఒక్క గెలుపును కూడా అందించలేకపోయాడు. అసలిది జట్టేనా? కోహ్లీలో నాయకత్వ లక్షణాల్లేవా? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన పోరులో బెంగళూరు గెలవడంతో కోహ్లీ ముఖంలో మళ్లీ వెలుగులు విరజిమ్మాయి. దీనిపై కోహ్లీ స్పందిస్తూ, ఈ విజయం వెనుక తన భార్య అందించిన ఎనలేని ప్రోత్సాహం ఉందంటూ కితాబిచ్చాడు.

ఒకప్పుడు తనకు కష్టకాలంలో తల్లి అండగా ఉండేదని, ఇప్పుడా పాత్రను తన భార్య అనుష్క శర్మ స్వీకరించిందని తెలిపాడు. పెళ్లయిన తర్వాత కలిసొచ్చిందని చెబుతున్న కోహ్లీ, ఒక దృఢమైన వ్యక్తి మనవెంట ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగలమని, ఆ విషయాన్ని అనుష్క సాహచర్యంలో తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని వివరించాడు. ఇన్ని ఓటముల తర్వాత కూడా సడలని ఆత్మవిశ్వాసంతో బరిలో దిగి సానుకూల దృక్పథం చూపగలిగానంటే అందుకు తన భార్యే కారణం అని స్పష్టం చేశాడు.

More Telugu News