Andhra Pradesh: ఏపీ ప్రజలు మే 23న చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయబోతున్నారు!: బుద్ధా వెంకన్న

  • బీజేపీ, వైసీపీ నేతలు కారుకూతలు కూస్తున్నారు
  • 2014లో బీజేపీ అధికారంలో లేదు కాబట్టే మేం మాట్లాడలేదు
  • విజయవాడలో మీడియాతో టీడీపీ నేత

మే 23న ఏపీ ప్రజలు చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయబోతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ, వైసీపీ నేతలు తమపై కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు.

2014లో బీజేపీ అధికారంలో లేదనీ, అందుకే అప్పుడు తాము ఈవీఎంలపై మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఈవీఎంలు పనిచేయకపోతే మీరెందుకు స్పందించలేదని ఇరు పార్టీలను ప్రశ్నించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడారు.

అధికారంలో లేకుండానే ఇన్ని అరాచకాలు సృష్టిస్తున్న వైసీపీ రేపు అధికారంలోకి వస్తే ఇంకెన్ని అరాచకాలు సృష్టిస్తుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేసేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తికి వైసీపీ వంతపాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంల పనితీరుపై ప్రశ్నిస్తే భయపడుతున్నారని వైసీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

More Telugu News