manohar parrikar: అందుకే అప్పట్లో పారికర్ రాజీనామా చేశారు: శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

  • గత నెల 17న పారికర్ మృతి
  • రాఫెల్ వ్యవహారంలో మోదీ తీరు నచ్చకే పారికర్ రాజీనామా చేశారన్న శరద్ పవార్
  • రాఫెల్ ఒప్పందాన్ని ఆయన అంగీకరించలేకపోయారన్న ఎన్సీపీ చీఫ్

రాఫెల్ యుద్ధ విమానాలపై రచ్చ కొనసాగుతున్న వేళ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ డీల్ వ్యవహారంలో ప్రధాని మోదీ తీరు నచ్చకే అప్పట్లో రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ తన పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. రాఫెల్ డీల్‌ను పారికర్ అంగీకరించలేకపోయారని, అందుకే ఆయన తన పదవికి రాజీనామా చేసి గోవా వెళ్లిపోయారని అన్నారు.

గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత నవంబరు 2014లో పారికర్ రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2015లో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ప్రధాని మోదీ ప్రకటన చేశారు. సెప్టెంబరు 23, 2016లో ఈ ఒప్పందానికి తుదిరూపం వచ్చింది. అయితే, ఈ ఒప్పందాన్ని రక్షణ మంత్రిగా ఉన్న పారికర్ అంగీకరించలేకపోయారని, అందుకనే మార్చి 2017లో తన పదవికి రాజీనామా చేసి గోవా సీఎంగా వెళ్లిపోయారని శరద్ పవార్ పేర్కొన్నారు. కాగా, కేన్సర్‌తో బాధపడుతూ పారికర్ గత నెల 17న తుదిశ్వాస విడిచారు.

More Telugu News