India: నాకు ఓటేయలేదో శపిస్తాను.. మీరంతా సుఖాలకు దూరమవుతారు!: ఓటర్లకు బీజేపీ నేత వార్నింగ్

  • ఉన్నావ్ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ నోటి దురుసు
  • తాను కోరింది ఇవ్వకపోతే కీడు జరుగుతుందని వ్యాఖ్య
  • సాక్షి మహరాజ్ వ్యాఖ్యలపై ఇంకా స్పందించని బీజేపీ

వివాదాలకు కేరాఫ్ గా మారిన బీజేపీ లోక్ సభ సభ్యుడు సాక్షి మహరాజ్ ఈసారి ఏకంగా ఓటర్లపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో తనకు ఓటేయకుంటే అందరిని శపిస్తానని ఆయన హెచ్చరించారు. తాను ఓ సన్యాసిననీ, తాను అడిగింది ఇవ్వకపోతే చెడు కలుగుతుందని పురాణాల్లో ఉందని వ్యాఖ్యానించారు. తనకు ఓటేయనివారు సుఖాలకు దూరమై పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవిస్తారని హెచ్చరించారు.

తాను ఆస్తులు అడగటం లేదనీ, దేశంలోని 125 కోట్ల మంది భవిష్యత్తును నిర్దేశించే ఓటును మాత్రమే అడుగుతున్నానని సెలవిచ్చారు. యూపీలోని ఉన్నావ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సాక్షి మహరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు ఇంతవరకూ స్పందించలేదు.

2014 లోక్ సభ ఎన్నికల్లో సాక్షి మహరాజ్ ఉన్నావ్ లోక్ సభ స్థానం నుంచి ఘనవిజయం సాధించారు. 2019లో మోదీ నెగ్గితే 2024లో ఎన్నికలే ఉండవని సాక్షి మహరాజ్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై పెద్దఎత్తున దుమారం చెలరేగింది.

More Telugu News