Maganti Babu: అధికారం లేనప్పుడే ఇలా హింసకు పాల్పడితే అధికారం చేతికొస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారు?: వైసీపీపై మాగంటి బాబు ధ్వజం

  • స్పీకర్ కోడెలపైనా దాడి చేశారు
  • మొదటి నుంచీ వైసీపీది నేర ప్రవృత్తే
  • మరోసారి వైసీపీ ప్రతిపక్షంలోనే

వైసీపీ తీరుపై టీడీపీ ఎంపీ మాగంటి బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పత్తికోనలంకలో నిన్న వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మాగంటి బాబు ఈరోజు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొదటి నుంచీ వైసీపీది నేర ప్రవృత్తేనని, స్పీకర్ కోడెలపైనా దాడి చేశారని మండి పడ్డారు. ఏ అధికారం లేనప్పుడే ఇలా హింసకు పాల్పడితే అధికారం చేతికొస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో హింస ప్రబలడానికి కారణం వైసీపీయేనని, ఏపీని ఆ పార్టీ నేతలు మరో బీహార్ చేయాలనుకుంటున్నారా? అని మాగంటి బాబు ధ్వజమెత్తారు. వైసీపీ ప్రవర్తనే తమ పార్టీకి మరోసారి అధికారం కట్టబెడుతుందని, మరోసారి వైసీపీ ప్రతిపక్షంలోనే ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 140 - 145 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ స్థానాలు వస్తాయన్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఎందఱో ఆంధ్రులు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలనుకున్నారని మాగంటి బాబు తెలిపారు.

More Telugu News