Andhra Pradesh: కడపలో ఎస్సై లాఠీచార్జి.. కళ్లలో కారం కొట్టి చావబాది ప్రతీకారం తీర్చుకున్న మహిళలు!

  • కడపలోని బ్రహ్మంగారి మఠం మండలంలో ఘటన
  • ఈరోజు ఉదయం మహిళలపై ఎస్సై రాజగోపాల్ లాఠీచార్జి
  • ఊరిలోకి రాగానే చుట్టముట్టి దాడిచేసిన మహిళలు

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప జిల్లాలో ఈరోజు పోలీసులపై మహిళలు తిరగబడ్డారు. తమపై లాఠీచార్జి చేసినందుకు ప్రతీకారంగా స్థానిక ఎస్సై కళ్లలోకి కారం కొట్టి, కర్రలతో చితక్కొట్టారు. ఈ ఘటన జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం గంగిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. బ్రహ్మంగారి మఠం ఎస్సై రాజగోపాల్ ఓ ఘటనకు సంబంధించి ఆందోళన చేస్తున్న మహిళలపై ఈరోజు ఉదయం లాఠీచార్జి చేయించారు.

దీంతో ఎస్సైపై కోపంతో రగిలిపోయిన మహిళలు అవకాశం కోసం వేచిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఊరిలోకి వచ్చిన ఎస్సై వాహనాన్ని మహిళలంతా ఒక్కసారిగా చుట్టుముట్టి అడ్డుకున్నారు. వాహనం దిగగానే ఎస్సై కళ్లలో కారం కొట్టారు. అనంతరం వెంటతెచ్చుకున్న కర్రలతో చావబాదారు. దీంతో ఆయన వెంటనే ఉన్న కానిస్టేబుళ్లు మహిళలపై లాఠీలు ఝుళిపించి ఎస్సై రాజగోపాల్ ను అక్కడి నుంచి తరలించారు.

More Telugu News