India: ఎన్నికల వేళ మావోయిస్టుల దుశ్చర్య.. పోలింగ్ కేంద్రానికి సమీపంలో బాంబు దాడి!

  • ఐఈడీని పేల్చివేసిన మావోయిస్టులు
  • మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో ఘటన
  • తప్పిన ప్రాణనష్టం, ఊపిరి పీల్చుకున్న అధికారులు

సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో మావోయిస్టులు రెచ్చిపోయారు. తమకు గట్టి పట్టు ఉన్న గడ్చిరోలీ జిల్లాలోని వాఘేజరీలో ఉన్న ఓ పోలింగ్ కేంద్రం సమీపంలో శక్తిమంతమైన అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) పేల్చారు. దీంతో పేలుడు తీవ్రతకు ఈ ప్రాంతం మొత్తం దద్దరిల్లింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈరోజు ఉదయం 10.30 గంటల సమయంలో పోలింగ్ కేంద్రానికి 150 మీటర్ల దూరంలో పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందన్నారు. గడ్చిరోలీతో పాటు మరో 6 లోక్ సభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది.

More Telugu News