Andhra Pradesh: తాడిపత్రిలో వేటకొడవళ్లతో నరుక్కున్న టీడీపీ-వైసీపీ వర్గాలు.. ఇద్దరు కార్యకర్తల దుర్మరణం!

  • అనంతపురంలోని వీరాపురంలో ఘటన
  • పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం, ఘర్షణ
  • దాడిలో మరో ఇద్దరి పరిస్థితి విషమం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో పరిస్థితులు ఒక్కసారిగా అదుపుతప్పాయి. ఈరోజు తాడిపత్రిలోని వీరాపురంలో ఏర్పాటుచేసిన ఓ పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం తలెత్తింది. అది కాస్తా ఘర్షణగా మారడంతో ఇరువర్గాలు వేటకొడవళ్లతో పరస్పరం దాడి చేసుకున్నాయి. దీంతో అక్కడి ఓటర్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇరువర్గాలు దాడి చేసుకోవడంతో ఈ ప్రాంతం రణరంగంగా మారింది.

ఈ దుర్ఘటనలో టీడీపీ కార్యకర్త భాస్కరరెడ్డి, వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు అదనపు బలగాలను మోహరించారు. జిల్లా ఎస్పీ ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

More Telugu News