raviteja: రవితేజ 'తెరి' రీమేక్ ఆగిపోయిందంటూ ఫిల్మ్ నగర్ టాక్

  • తమిళంలో హిట్ కొట్టిన విజయ్ 'తెరి'
  • తెలుగులో రీమేక్ చేయాలనుకున్న సంతోష్ శ్రీనివాస్
  • ప్రాజెక్టును పక్కన పెట్టేసిన మైత్రీ మూవీ మేకర్స్         

వరుస పరాజయాలతో రవితేజ సతమతమవుతున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా కూడా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలోనే ఆయన తమిళ చిత్రం 'తెరి' రీమేక్ లో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. తమిళంలో విజయ్ కథానాయకుడిగా 2016లో వచ్చిన 'తెరి' అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఈ సినిమాను పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేయాలని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ భావించాడు.

అయితే  పవన్ రాజకీయాల్లోకి రావడంతో ఆయన ప్రయత్నం ఫలించలేదు. దాంతో మైత్రీ మూవీ మేకర్స్ వారి బ్యానర్లో రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ ఈ రీమేక్ చేయనున్నట్టుగా చెప్పారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సినిమా పట్టాలెక్కుతుందని అన్నారు. కానీ కథలో చేసిన మార్పులు సంతృప్తికరంగా లేవని చెప్పిన మైత్రీ మూవీ మేకర్స్ వారు, చివరికి ఈ ప్రాజెక్టు వర్కౌట్ కాదు అని భావించి ఆపేసినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.

More Telugu News