Trans woman: ఎట్టకేలకు ఓటేస్తున్న ట్రాన్స్‌జెండర్ రియన్నా.. ఈమెకో ప్రత్యేకత!

  • 18 ఏళ్లు వచ్చినప్పటి నుంచీ ఓటు కోసం దరఖాస్తు
  • ప్రతీసారి చెత్తబుట్టలో పడేసిన అధికారులు
  • తొలిసారి ఓటు వేయబోతున్న రియన్నా

తొలి విడత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు దేశవ్యాప్తంగా ఓటర్లు బారులు తీరారు. బెంగళూరుకు చెందిన రియన్న కూడా ఓటేసేందుకు క్యూలో నిల్చుంది. అయితే, ఈమెకో ప్రత్యేకత ఉంది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన రియన్నా తనకు 18 ఏళ్లు వచ్చినప్పటి నుంచీ ఓటు కోసం దరఖాస్తు చేస్తూనే ఉంది. 11 సార్లు ఆమె దరఖాస్తును అధికారులు చెత్తబుట్టలో పడేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైన తన ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో రియన్నా మరోమారు దరఖాస్తు చేసుకుంది.

అయితే, ఈసారి ఆమెకు ఓటరు కార్డు ఇవ్వక తప్పలేదు. ట్రాన్స్‌జెండర్లకు కూడా ఓటు వేసే హక్కు ఉందని గుర్తించిన అధికారులు తాజాగా మాత్రం ఆమెకు ఓటరు కార్డు మంజూరు చేశారు. తొలిసారి ఓటు వేయబోతున్న రియన్నా బెంగళూరు సెంట్రల్‌లో ఓటు హక్కు వినియోగించుకోబోతోంది. ప్రస్తుతం క్యూలో ఉన్న ఆమె ఆ విషయాన్ని ఆనందంగా చెప్పింది.

More Telugu News