Andhra Pradesh: తొలి దశ సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం.. మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం

  • 18 రాష్ట్రాల్లో 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్
  • ఏడు గంటలకు ప్రారంభమై 5 గంటలకు ముగియనున్న పోలింగ్ 
  • ఏపీ అసెంబ్లీ బరిలో 2,118 మంది అభ్యర్థులు

దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాల్లో 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. వీటిలో ఏపీలో 25, తెలంగాణలో 17, యూపీలో 8, మహారాష్ట్రలో 7, అసోంలో 5, ఉత్తరాఖండ్‌లో 5, ఒడిశాలో 4, బీహార్‌లో 4, పశ్చిమబెంగాల్‌లో 2, అరుణాచల్‌ప్రదేశ్‌లో 2, చత్తీస్‌గఢ్‌లో 1, జమ్ముకశ్మీర్‌లో 2, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్, లక్షద్వీప్‌లలో ఒక్కో స్థానంలో పోలింగ్ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ బరిలో 2,118 మంది అభ్యర్థులున్నారు. 25 లోక్‌సభ స్థానాల్లో 319 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.98 కోట్లు కాగా, వీరిలో మహిళా ఓటర్లు 1.98 కోట్ల మంది. పురుష ఓటర్లు 1.94 కోట్ల మంది. ఇక, తొలిసారి ఓటు వేయబోతున్న వారి సంఖ్య 10 లక్షలు. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, బరిలో 443 మంది అభ్యర్థులున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై ఐదు గంటలకు ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందే పోలింగ్ ముగుస్తుంది. తెలంగాణలోని నిజామాబాద్‌లో మాత్రం ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. 

More Telugu News