paruchuri: చిరాకుతో అన్నమాటలు పట్టించుకోవద్దని కృష్ణగారు అన్నారు: పరుచూరి గోపాలకృష్ణ

  • కృష్ణగారు తమ ఇంటికి రమ్మన్నారు
  • నేను వెళ్లి ఆయనను కలిశాను 
  • ఆ తరువాత కలిసి పనిచేస్తూ వెళ్లాము    

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, తనపై కృష్ణగారికి కోపం వచ్చి వెళ్లిపొమ్మనడం .. కోపం తగ్గిన తరువాత పిలిపించడం గురించి ప్రస్తావించారు. "కృష్ణగారికి కోపం వచ్చి వెళ్లిపొమ్మనడంతో నేను .. అన్నయ్య చెన్నైకి వచ్చేశాము. మరుసటి రోజు ఉదయాన్నే నా గురించి కృష్ణ గారు అడిగితే .. పంపించేసినట్టు అక్కడి వాళ్లు చెప్పారట. 'ఏదో చిరాకుతో అలా అన్నాను .. పిలిపించండి' అన్నారట. దాంతో రాఘవేంద్రరావు గారి దగ్గర కో డైరెక్టర్ గా పనిచేసే సత్యం గారు మా కోసం చెన్నై వచ్చాడు.

'అసలు కృష్ణగారు ఎందుకు వెళ్లిపొమ్మన్నారో నాకు అర్థం కాలేదు .. వద్దులెండి' అన్నాను. అదే సమయంలో ఎమ్మెస్ రెడ్డిగారు .. 'పల్నాటి సింహం' సినిమా క్లైమాక్స్ ను విజయవాడలో తీస్తూ .. నన్ను రమ్మన్నారు. నాపై కృష్ణగారికి కోపం వచ్చిన విషయం నేను రెడ్డిగారికి చెప్పాను. అప్పుడు ఆయన కృష్ణగారి దగ్గరికి వెళ్లి మాట్లాడి .. ఆ ఫోన్ కృష్ణగారికి ఇచ్చారు.

'చిన్న పరుచూరి గారూ .. ఒకసారి మీరు మా ఇంటికి రండి' అన్నారు కృష్ణగారు. దగ్గరే కావడంతో నడుచుకుంటూ వెళ్లాను. కృష్ణగారు పలకరిస్తూ ..  'ఏదో చిరాకుతో అన్నాను .. ఏమీ అనుకోకండి' అన్నారు. అప్పుడు నేను కూడా .. ఆ రోజున ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో చెప్పాను. ఆ తరువాత నుంచి మళ్లీ మేము కలిసి పనిచేస్తూ వెళ్లాము" అని చెప్పుకొచ్చారు.

More Telugu News