India: మోదీ మళ్లీ వస్తేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం!: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

  • కాంగ్రెస్ శాంతి చర్చలకు భయపడొచ్చు
  • హిందుత్వతో భారత్ లో ముస్లింలు ఇబ్బంది పడుతున్నారు
  • విదేశీ మీడియాతో పాక్ ప్రధాని వ్యాఖ్య

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలన్నా, శాంతి చర్చలు ప్రారంభం కావాలన్నా మరోసారి బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరికే అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారత్ లో అధికారంలోకి వస్తే ధైర్యంతో శాంతి చర్చలు సాగించలేరని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ విదేశీ మీడియాతో చెప్పినట్లు కథనాలు వచ్చాయి.

భారత్ లో తనకు చాలామంది ముస్లిం స్నేహితులు ఉన్నారనీ, వారంతా ప్రస్తుతం హిందుత్వ జాతీయవాదంతో ఇబ్బంది పడుతున్నారని ఇమ్రాన్ తెలిపారు. నరేంద్ర మోదీ తీరు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ తరహాలో ఉందనీ, ఆయన భయం-జాతీయవాదం సిద్ధాంతాలతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

కశ్మీర్ అన్నది రాజకీయ సమస్య అనీ, దాన్ని సైనిక చర్య ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేశారు. ఇప్పటికే పాక్ లోని చాలామంది ఉగ్రవాదులను ఆర్మీ ఏరివేసిందని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తనకు వ్యతిరేకత పెరిగితే సైన్యం చేత మోదీ పాక్ పై దాడి చేయించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు

More Telugu News