India: వ్యవసాయ శాస్త్రం విద్యార్థికి రూ.కోటి వేతనం.. మోన్ శాంటోలో ఉద్యోగాన్ని సాధించిన యువతి!

  • ఎల్పీయూలో చదువుతున్న కవిత ఫమన్
  • మోన్ శాంటో నిర్వహించిన రాతపరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత
  • కెనడాలో విధులు నిర్వహించనున్న యువతి

వ్యవసాయ రంగంలో డిగ్రీ చేసిన విద్యార్థులకు గతంలో ఉద్యోగాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ప్రపంచీకరణ, విదేశీ కంపెనీల రాక సందర్భంగా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. తాజాగా పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)కి చెందిన ఓ యువతి భారీ ప్యాకేజీ దక్కించుకుంది. అంతర్జాతీయ ఎరువులు, విత్తనాల కంపెనీ మోన్ శాంటోలో ఏడాదికి రూ.కోటి వేతనంతో ప్రొడక్షన్ మేనేజర్ ఉద్యోగాన్ని పొందింది.

ఎల్పీయూలో ఎమ్మెల్సీ అగ్రికల్చర్(ఆగ్రోనమీ) చివరి సంవత్సరం చదువుతున్న కవిత ఫమన్.. మోన్ శాంటో సంస్థ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్ ప్రక్రియకు హాజరైంది. ఈ సందర్భంగా రాతపరీక్షతో పాటు ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులయింది. దీంతో మోన్ శాంటో భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం ఇచ్చింది. కాగా, విధుల్లో భాగంగా కెనడాలోని మోన్ శాంటో విభాగంలో కవిత పనిచేయాల్సి ఉంటుంది.

మోన్ శాంటోను ఇటీవల జర్మన్ ఎరువుల దిగ్గజం బేయర్స్ కొనుగోలు చేసింది. మరోవైపు ఈ విషయమై కవిత స్పందిస్తూ.. మోన్‌శాంటోలో చేరేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, తన కల నిజమైనట్లు ఉందని వ్యాఖ్యానించింది. ఇక ఎల్పీయూ డైరెక్టర్ సింగ్ మాట్లాడుతూ.. ఓ వ్యవసాయ విద్యార్థికి ఇంత భారీ ప్యాకేజీ రావడం ఇదే తొలిసారని అన్నారు.

More Telugu News