Rahul Gandhi: అమేథీలో నేడు రాహుల్ నామినేషన్.. పూలవర్షం కురిపించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ శ్రేణులు

  • ఈ నెల 4న కేరళలోని వయనాడ్‌లో రాహుల్ నామినేషన్
  • రాహుల్ నామినేషన్ కార్యక్రమానికి సోనియా, ప్రియాంక
  • రేపు బీజేపీ అభ్యర్థి స్మృతి అమేథీలో నామినేషన్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు అమేథీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాహుల్‌కు ప్రత్యర్థిగా గత ఎన్నికల్లో ఆయనపై ఓటమి పాలైన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోమారు బరిలోకి దిగారు. రాహుల్ నామినేషన్ కార్యక్రమంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొననున్నారు. ఇక, గురువారం స్మృతి ఇరానీ నామినేషన్ వేయనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేబినెట్ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతోపాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ ఈ నెల 4న వయనాడ్‌లో నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత నదీమ్ అష్రాఫ్ మాట్లాడుతూ.. నామినేషన్ వేసేందుకు వస్తున్న రాహుల్, ఇతర నేతలపై పూలవర్షం కురిపించి ఆహ్వానించనున్నట్టు తెలిపారు. రాహుల్ నామినేషన్ కోసం కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.

కాంగ్రెస్‌కే చెందిన మరో నేత దీపక్ సింగ్ మాట్లాడుతూ.. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత స్మృతి ఇరానీ అమేథీకి 15 సార్లు మాత్రమే వచ్చారని, 44 గంటలు మాత్రమే గడిపారని తెలిపారు. రాహుల్ మాత్రం ఏకంగా 744 గంటలు తన నియోజకవర్గ ప్రజల కోసం కేటాయించినట్టు పేర్కొన్నారు.

More Telugu News