Andhra Pradesh: ఏపీ ప్రయాణికులకు షాక్.. చివరి నిమిషంలో 125 బస్సులను రద్దు చేసిన కావేరి ట్రావెల్స్

  • సొంతూళ్లకు పయనమవుతున్న హైదరాబాద్‌లోని ఏపీ వాసులు
  • మొత్తంగా నిలిచిపోయిన 200 బస్సులు
  • తలలు పట్టుకుంటున్న ప్రయాణికులు

ఏపీ ఓటర్లకు కావేరి ట్రావెల్స్ షాకిచ్చింది. చివరి నిమిషంలో ఏకంగా 125 బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని ఏపీ ఓటర్లు సొంతూళ్లు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పదో తేదీన (నేడు) ఊరు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలా చాలామంది ప్రైవేటు ట్రావెల్స్‌ను నమ్ముకున్నారు. అయితే, కావేరి ట్రావెల్స్ యాజమాన్యం అకస్మాత్తుగా 125 బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు.

దీనికి తోడు తెలంగాణలో లైసెన్స్ లేదన్న కారణంతో తెలంగాణ ఆర్టీఏ అధికారులు మరికొన్ని ట్రావెల్స్ బస్సులను రద్దు చేశారు. దీంతో మొత్తంగా 200 వరకు బస్సులు నిలిచిపోయాయి. బస్సులు రద్దయ్యాయంటూ ప్రైవేటు యాజమాన్యాలు ప్రయాణికులకు మెసేజ్‌లు పంపడంతో ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 

More Telugu News