Andhra Pradesh: వైసీపీ నేత పొట్లూరి షేర్ హోల్డర్లను మోసం చేశారు.. ఆయనపై సెబీ నిషేధం విధించింది!: కేశినేని నాని ఆరోపణ

  • జగన్ కోసం మోదీ, కేసీఆర్ పనిచేస్తున్నారు
  • పీవీపీ, జగన్ తో ఏపీకి అప్రతిష్ట
  • విజయవాడలో మీడియాతో టీడీపీ నేత

జగన్ కోసం మోదీ, కేసీఆర్ కలిసి పనిచేస్తున్నారని విజయవాడ లోక్ సభ సభ్యుడు, టీడీపీ నేత కేశినేని నాని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు. దొంగలు, కుంభకోణాలకు పాల్పడిన వారు ప్రస్తుతం వైసీపీ నుంచి పోటీచేస్తున్నారని విమర్శించారు. విజయవాడలో ఈరోజు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేశినేని నాని మాట్లాడారు.

వైసీపీలో 97 మంది ఎమ్మెల్యే, 12 మంది లోక్ సభ అభ్యర్థులపై కేసులు ఉన్నాయని కేశినేని నాని దుయ్యబట్టారు. ఇక వైసీపీ అధినేత జగన్ పై అయితే ఏకంగా 31 కేసులు ఉన్నాయన్నారు. జగన్, పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) వంటి వ్యక్తులతో ఆంధ్రప్రదేశ్ కే అప్రతిష్ట అని నాని వ్యాఖ్యానించారు.

షేర్ హోల్డర్లను మోసం చేసినందుకు వైసీపీ నేత పీవీపీ వ్యాపార కార్యకలాపాలను సెబీ నిషేధించిందని గుర్తుచేశారు. వ్యాపారం చేయడానికి పీవీపీ పనికిరాడని అమెరికా బ్యాంకులే చెప్పాయన్నారు. గత ఎన్నికల్లో ఆలోచనతో వేసిన ఓటు అభివృద్ధికి కారణమయిందని వ్యాఖ్యానించారు. ఈసారి కూడా ప్రజలు ఆలోచించి విజ్ఞతతో ఓటేయాలని కోరారు.

More Telugu News