Chandrababu: ఆంధ్రోళ్లు ద్రోహులు, దద్దమ్మలని నువ్వు తిట్టలేదా కేసీఆర్?: నిప్పులు చెరిగిన చంద్రబాబు

  • హోదా కోసం కేసీఆర్ మద్దతు నిజమే అయితే కేంద్రానికి జగన్ లేఖ రాయించాలి
  • మద్దతు పేరిట డ్రామాలు కట్టిపెట్టండి
  • పోలవరం గ్రాఫిక్స్ అని ఇప్పుడు ముంపు అంటారా?

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి మచిలీపట్టణంలో మాట్లాడుతూ.. జగన్, కేసీఆర్, మోదీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులకు తాము అడ్డుకాదన్న కేసీఆర్ తాజా ప్రకటనపై చంద్రబాబు మాట్లాడుతూ.. మద్దతు పేరిట డ్రామాలు కట్టిపెట్టాలన్నారు.

 కేసీఆర్‌తో కలిసి హోదా సాధిస్తామంటున్న జగన్ నేటి సాయంత్రంలోగా తమ ఫెడరల్ ఫ్రంట్ తరపున కేసీఆర్‌తో కేంద్రానికి లేఖ రాయించాలని అన్నారు. పోలవరానికి తాము అడ్డం కాదన్న కేసీఆర్ ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ జీవితమంతా అబద్ధాలేనన్న చంద్రబాబు.. ఆంధ్రులను ద్రోహులని, దద్దమ్మలని తిట్టలేదా? అని ప్రశ్నించారు. కోడికత్తి పార్టీకి డబ్బులిచ్చే డ్రామాలు కట్టిపెట్టాలన్నారు. జగన్‌కు వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి, రాష్ట్రానికి రావాల్సిన లక్ష కోట్లను ఎగ్గొట్టాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. పోలవరం గ్రాఫిక్స్ అన్న కేసీఆర్ ఇప్పుడు ముంపు గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.

More Telugu News