Chandrababu: మోదీ అహంకారాన్ని చూశారు... ఇప్పుడు దేవెగౌడ వినయం చూడండి: తిరువూరు రోడ్ షోలో చంద్రబాబు

  • చరిత్రకు శ్రీకారం చుట్టిన వ్యక్తి దేవెగౌడ
  • ఆయన లౌకికవాది
  • మనకోసం వచ్చారు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా తిరువూరులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ తరఫున ప్రచారానికి విచ్చేసిన మాజీ ప్రధానమంత్రి హెచ్.డి. దేవెగౌడకు కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణాదిలో ఉన్న ఏకైక పెద్ద దిక్కు దేవెగౌడ అని చంద్రబాబు పేర్కొన్నారు.

"దేశంలో ఎంతో పేరున్న వ్యక్తి దేవెగౌడ గారు. ఒక మాజీ ప్రధానిగానే కాదు, రైతు కుటుంబంలో పుట్టి ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా దేవెగౌడను గుర్తుంచుకోవాలి. లౌకికవాదులను ఏకం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. దేవెగౌడే నాకు ఆదర్శం. నేను ఎంత కష్టపడినా పెద్దల అండ ఉండాలని కోరుకుంటాను. ఆ విధంగా నాకు అండగా నిలబడిన వ్యక్తి దేవెగౌడ.

ఇదే తిరువూరులో ప్రజలు మోదీ అహాన్ని చూశారు, ఇప్పుడు దేవెగౌడ వినయం చూశారు. ఆయన ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి. నీతినిజాయతీ ఉన్న వ్యక్తి దేవెగౌడ గారు. అలాంటి వ్యక్తి అవసరం రాష్ట్రానికి ఉంది. అందుకే మీ అందరి తరఫున ఆయనకు పాదాభివందనం చేస్తున్నా" అంటూ తనతో పాటు వాహనంపై ఉన్న దేవెగౌడకు పాదాభివందనం చేశారు.  

ఆయన ఆశీస్సులు మనకు ఎప్పుడూ కావాలని, ఈమేరకు దేవెగౌడ గారిని అభ్యర్థిస్తున్నానంటూ చంద్రబాబు ఆంగ్లంలో మాట్లాడారు. మాకు మద్దతుగా ప్రచారానికి రావడం పట్ల ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News