India: నా ఇంటిపైనా ఐటీ దాడులు జరగబోతున్నాయి.. కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం వ్యాఖ్య!

  • ఐటీ అధికారులను సాదరంగా స్వాగతిస్తాను
  • ఈ చర్యలను దేశ ప్రజలు గమనిస్తున్నారు
  • బీజేపీకి త్వరలోనే బుద్ధి చెబుతారు

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ ఐటీ దాడులపై కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం స్పందించారు. త్వరలోనే తన ఇంటిపై కూడా ఐటీ దాడులు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వీటన్నింటిని దేశ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఐటీ శాఖ అధికారులు గతంలోనే తన ఇంట్లో తనిఖీలు చేపట్టారనీ, అప్పుడు ఏమీ దొరకలేదని స్పష్టం చేశారు.

కేవలం తమ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకే ఈ చర్యకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. తనిఖీలకు వచ్చే ఐటీ అధికారులను స్వాగతిస్తామని అన్నారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో దేశప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో చిదంబరం కొడుకు కార్తీ శివగంగ లోక్ సభ సీటు నుంచి పోటీ చేస్తున్నారు.

More Telugu News