Crime News: కూతుర్ని కత్తితో పొడిచి చంపి.. తానూ ఆత్మహత్య చేసుకున్న మహిళ

  • వనపర్తి జిల్లా పాలెం గ్రామంలో విషాదం
  • బిడ్డను కత్తితో పొడిచి హత్య...తాను పురుగుల మందుతాగి..
  • ఆత్మహత్యకు లభించని కారణాలు

ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో... కన్నబిడ్డను చేజేతులా కాటికి పంపింది. ఆ తర్వాత తానూ ఈలోకాన్ని విడిచి వెళ్లింది. పోలీసుల కథనం మేరకు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన నిర్మల (35), నరసింహ దంపతులు. వీరికి సింధు అని ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. నిర్మల భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో కూతుర్ని తీసుకుని ఆమె ఆరేపల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఉగాది సందర్భంగా ఈనెల ఆరున కూతుర్ని తీసుకుని అత్తవారింటికి వచ్చింది.

అక్కడ ఏం జరిగిందో ఏమో అర్ధరాత్రి కూతుర్ని కత్తితో పొడిచి హత్య చేసింది. ఆమె చనిపోయిందని నిర్థారించుకున్న తర్వాత తాను పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేసింది. తెల్లవారు జామున ఆపస్మారక స్థితిలో ఉన్న నిర్మలను, విగతజీవిగా పడివున్న సింధును గుర్తించి కుటుంబ సభ్యులు  షాక్‌ అయ్యారు. కొన ఊపిరితో ఉన్న నిర్మలను వనపర్తిలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.  

More Telugu News