poacher: ఖడ్గమృగాన్ని వేటాడేందుకు వెళ్లి ఏనుగులకు బలి.. పీక్కుతిన్న సింహాలు!

  • దక్షిణాఫ్రికాలోని కృగెర్ నేషనల్ పార్క్‌లో ఘటన
  • అకస్మాత్తుగా ఏనుగు దాడి చేసిన వైనం
  • భయంతో పరుగులు తీసిన మిగతా వేటగాళ్లు

ఖడ్గమృగాన్ని వేటాడేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ఏనుగుల బారినపడి ప్రాణాలు కోల్పోగా సింహాలు అతడిని పీక్కుతిన్నాయి. దక్షిణాఫ్రికాలోని సుప్రసిద్ధ కృగెర్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆకలితో ఉన్న సింహాలు వేటగాడిని పూర్తిగా ఆరగించగా అతడి దుస్తులు, ఎముకలు, తల మాత్రమే మిగిలాయి. కొంతమంది వేటగాళ్లు ఖడ్గమృగాన్ని వేటాడేందుకు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది. అకస్మాత్తుగా ఓ ఏనుగు వేటగాళ్ల గుంపుపై దాడిచేసింది. ఓ వ్యక్తి దానికి దొరికిపోగా అది అతడిని చంపేసింది. ఆ తర్వాత అది వదిలివెళ్లిపోగా సింహాలు ఆ మృతదేహాన్ని పీక్కుతిన్నాయి.

ఈ ఘటన తర్వాత భయంతో పరుగులు తీసిన మిగతా వేటగాళ్లు విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మిగతా వేటగాళ్ల కోసం పోలీసులు వేట ప్రారంభించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు వేట తుపాకులు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి మరింత సమాచారం కోసం ప్రశ్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News