Nizamabad: ఎన్నికల నిర్వహణ ఖర్చులో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన నిజామాబాద్!

  • లోక్ సభ ఎన్నికల్లో 185 మంది పోటీ
  • రూ. 35 కోట్ల వరకూ ఎన్నికల ఖర్చు
  • 25 వేలకు పైగా ఈవీఎంల వినియోగం

ఇండియాలోనే అత్యధికంగా 185 మంది పోటీ చేస్తున్న నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ ఎన్నిక నిర్వహణ ఖర్చు, ఇప్పుడు సరికొత్త రికార్డును సృష్టిస్తోంది. ఈవీఎంలను వాడి ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించడంతో 25 వేలకు పైగా ఈవీఎంలు, 1,788 వీవీ ప్యాట్లు అవసరం కానున్నాయి. దీంతో ఎన్నికల ఖర్చు రూ. 35 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

స్వతంత్ర భారతావనిలో ఓ లోక్ సభ నియోజకవర్గ ఎన్నిక నిర్వహించడానికి ఈసీ వెచ్చిస్తున్న అత్యధిక మొత్తం ఇదే కావడం గమనార్హం. ఇక ఎన్నికలు సజావుగా సాగడానికి 400 మంది ఇంజనీర్లను ఈసీ సిద్ధం చేసింది. అత్యవసరమైతే వినియోగించేందుకు ఓ హెలికాప్టర్ ను అందుబాటులో ఉంచింది. మొత్తం 1,788 పోలింగ్ కేంద్రాల్లో ఒక వీవీ ప్యాట్, ఒక కంట్రోలింగ్ యూనిట్, 12 ఈవీఎంలు ఉంటాయి. సాధారణంగా ఒక్కో పోలింగ్ బూత్ లో నలుగురు సిబ్బంది ఉంటుండగా, నిజామాబాద్ పరిధిలో మాత్రం మరో ఇద్దరిని అదనంగా నియమించనుంది.

More Telugu News