Andhra Pradesh: జగన్ సీఎం కావడం ఖాయం.. ఏపీ ప్రత్యేక హోదాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం!: మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ

  • ప్రధాని పదవికి కేసీఆర్ అర్హుడు
  • చంద్రబాబుకు నిబద్ధత లేదు
  • ముస్లింలకు డిప్యూటీ సీఎం అని కొత్త పాట అందుకున్నారు
  • మీడియాతో హైదరాబాద్ ఎంపీ వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని పదవికి అన్నివిధాలా అర్హుడని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఈ సారి కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని జోస్యం చెప్పారు. కొద్దిరోజుల్లోనే మోదీ మాజీ ప్రధాని కాబోతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ లో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒవైసీ పలు అంశాలపై  ముచ్చటించారు.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఒవైసీ పునరుద్ఘాటించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ నిబద్ధత లేదని స్పష్టం చేశారు. గోద్రా అల్లర్ల సమయంలో బీజేపీకి టీడీపీ మిత్రపక్షంగానే కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇన్నేళ్లు ముస్లిం వర్గాన్ని దూరం పెట్టిన బాబు ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని కొత్త రాగం అందుకున్నారని దుయ్యబట్టారు.

ఏపీ ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదని ఒవైసీ తేల్చిచెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో మజ్లిస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఒవైసీ తెలిపారు. హోదా సాధించేందుకు జగన్ కు భారీ మెజారిటీతో గెలుపును కట్టబెట్టాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.

More Telugu News