KA Paul: సీసీటీవీ ఫుటేజ్ కావాలంటూ హోటల్ సిబ్బందిపై చిందులేసిన కేఏ పాల్

  • అభిమానులమంటూ వచ్చి దాడికి యత్నం
  • కేకలు వేసిన పాల్
  • ఎట్టకేలకు సీసీటీవీ ఫుటేజ్ అందించిన హోటల్ సిబ్బంది

ఈ ఎన్నికల్లో నెగ్గి సీఎం అవ్వాలని భావిస్తున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పోలింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాల్ భీమవరం అసెంబ్లీ స్థానంతోపాటు నరసాపురం లోక్ సభ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఎప్పుడూ ఏదో కారణంతో మీడియాలో ఉండడం పాల్ స్టయిల్. అయితే, భీమవరంలో తాను బసచేసిన హోటల్ లో నానా రభస సృష్టించడం ద్వారా మరోసారి వార్తల్లోకెక్కారు. గతరాత్రి తనపై కొందరు వ్యక్తులు దాడిచేశారని ఆరోపిస్తున్న పాల్ అందుకు సీసీటీవీ ఫుటేజే సాక్ష్యమని చెబుతున్నారు.

భీమవరంలోని అతిథి హోటల్ లో ఆయన బస చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తన గదికి కొందరు వ్యక్తులు వచ్చి దౌర్జన్యం చేశారని పాల్ ఆరోపిస్తున్నారు. అభిమానులమంటూ వచ్చి దాడికి దిగారని, తాను కేకలు వేయడంతో పారిపోయారని ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజ్ అందిస్తే వాళ్లెవరో చెబుతానని పాల్ పేర్కొనగా, కంప్యూటర్ మరమ్మతులకు గురైందని హోటల్ యాజమాన్యం బదులిచ్చింది. దాంతో ఈ మతప్రచారకుడు ఆగ్రహోదగ్రుడయ్యారు. అప్పటికీ పాల్ శాంతించికపోవడంతో చివరికి హోటల్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ అందించారు.

More Telugu News