mohanbabu: చంద్రబాబు ఐదేళ్లపాలన 'దోచుకో...దాచుకో' అన్నట్లు సాగింది: మోహన్‌బాబు

  • భీమవరం రోడ్డు షోలో బాబుపై నిప్పులు
  • లక్ష కోట్లు దోచేసిన గజదొంగ బాబు అని విమర్శ
  • మళ్లీ అతనికి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతిపాలని హెచ్చరిక

సినీ నటుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మంచు మోహన్‌బాబు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు. బాబు ఐదేళ్లపాలన ‘దోచుకో...దాచుకో’ అన్నట్లు సాగిందని, లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచేసిన గజదొంగ చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం రాత్రి ఆయన భీమవరంలో నిర్వహించిన రోడ్డు షోలో ప్రసంగించారు.

 మట్టి నుంచి రాష్ట్ర నిర్మాణం కోసం వచ్చిన లక్షల కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు. కేంద్రంతో ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఆంధ్రా ప్రజల్ని ఆట వస్తువుగా బాబు భావిస్తున్నాడని మండిపడ్డారు. ‘కొంతకాలం బీజేపీతో అంటకాగుతారు, మరికొంత కాలం కాంగ్రెస్‌తో జట్టుకడతారు. ప్రత్యేక హోదా సొమ్ము కాజేశాక బీజేపీకి రాంరాం చెప్పేశారు. వారితో కలిసి ఉన్నప్పుడు కనిపించని ప్రత్యేక హోదా ఇప్పుడు కాంగ్రెస్‌తో జత కలిశాక కనిపిస్తోంది. ఇటువంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది’ అంటూ మోహన్‌బాబుహెచ్చరించారు.

ఎన్టీఆర్‌ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, ఆయన అంతటి మోసగాడు రాష్ట్రంలోనే ఎవరూ లేరన్నారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని కోరుతూ జగన్‌ ‘నవరత్నాలు’తో మీ ముందుకు వస్తున్నాడని, ఆయనను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేయాలని పిలపునిచ్చారు. చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకుని కొన్ని పార్టీలు వస్తున్నాయని, వాటిని నమ్మొద్దని కోరారు.

More Telugu News