Kurnool District: నంద్యాల జనసేన అభ్యర్థి ఎస్పీవై రెడ్డికి తీవ్ర అస్వస్థత

  • హుటాహుటిన హైదరాబాద్‌ తరలించిన కుటుంబ సభ్యులు
  • ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • టీడీపీ టికెట్‌ నిరాకరణతో పార్టీ మారిన ఎంపీ

నంద్యాల జనసేన అభ్యర్థి, సిటింగ్‌ ఎంపీ ఎస్పీవై రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన అస్వస్థులు కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌ తరలించారు. అక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

గత ఎన్నికల్లో నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన ఎస్పీవై రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. అప్పటి నుంచి ఆ పార్టీలో కొనసాగిన ఆయన తాజా ఎన్నికల్లో మళ్లీ నంద్యాల టికెట్టు ఆశించారు. అయితే తెలుగుదేశం పార్టీ మొండిచెయ్యి చూపడంతో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

ఆ పార్టీ టికెట్టు కేటాయించడంతో ప్రస్తుతం నంద్యాల నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓట్లు చీలుతాయన్న ఉద్దేశంతో ఎస్పీవై రెడ్డిని చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ సీటిస్తానని చెప్పినా ఆయన మనసు మార్చుకోలేదు.

More Telugu News