Chandrababu: అబద్ధాలు అలవోకగా చెప్పగల దిట్ట చంద్రబాబు: ఐవైఆర్‌ సెటైర్‌

  • చంద్రబాబు ఇచ్చిన హామీలకు 20 లక్షల కోట్లు ఖర్చవుతుంది
  • ఇప్పటి వరకు మేనిఫెస్టో విడుదల చేయని టీడీపీ ఓట్లెలా అడుగుతుంది
  • చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే 50 సీట్లు ఎక్కువ వస్తాయి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అబద్ధాలను అలవోకగా చెప్పడంలో దిట్టని ఏపీ మాజీ చీఫ్‌ సెక్రటరీ, బీజేపీ నాయకుడు ఐ.వై.ఆర్‌.కృష్ణారావు విమర్శించారు. ఆయన చాలా సింపుల్‌గా అబద్ధాలు చెప్పేస్తారని అన్నారు. చంద్రబాబు ఇస్తున్న హామీలకు 20 లక్షల కోట్లు ఖర్చవుతుందని, అంతమొత్తం ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ‘పసుపు-కుంకుమ‘ పేరుతో చంద్రబాబు మహిళలకు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులిస్తూ పరోక్షంగా ఓట్లు కొంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు మేనిఫెస్టో విడుదల చేయని చంద్రబాబు ప్రజల్ని ఓట్లెలా అడుగుతారని ప్రశ్నించారు.

ఇక, ఎన్నికలయ్యాక దేశమంతా తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చంద్రబాబు గొప్పగా చెబుతున్నారని, ఆయన ప్రచారం చేస్తే బీజేపీకి అదనంగా యాభై సీట్లు వస్తాయని అన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేస్తున్న రాహుల్‌గాంధీ, ఇతర పక్షాల తరపున ప్రచారం చేస్తున్న మాయావతి ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని హామీ ఇస్తున్నారని, కానీ ఎటువంటి హోదా ఇస్తారో చెప్పడం లేదన్నారు. పరిశ్రమలకు రాయితీలతో కూడిన హోదా ఇస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని, అటువంటిది కానప్పుడు ఇచ్చినా వృథాయేనన్నారు.

More Telugu News