Andhra Pradesh: కుటుంబ కలహాల నేపథ్యంలో.. భార్య, అత్తమామలపై కత్తితో దాడి.. ఇద్దరి పరిస్థితి విషమం!

  • ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘటన
  • భార్య పరిస్థితి విషమం.. కోమాలోకి అత్త
  • పరారీలో ఉన్న నిందితుడు

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉన్మాదిగా మారిపోయాడు. కట్టుకున్న భార్యతో పాటు అత్తామామలపై కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, అత్త కోమాలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో బొప్పుడి వెంకట్రావు అత్తారింటిలో భార్య అనితతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మామ రామకృష్ణ, అనిత, అత్త మంగమ్మతో నిన్నరాత్రి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన వెంకట్రావు.. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు కత్తితో అత్తమామలు, భార్యపై దాడిచేశాడు. తల, మెడపై కత్తివేట్లు పడటంతో ఈ ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.

ఈ సందర్భంగా దాడి నుంచి తప్పించుకున్న రామకృష్ణ బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో నిందితుడు పరారయ్యాడు. అనంతరం స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం భార్య అనిత పరిస్థితి విషమంగా ఉండగా, అత్త మంగమ్మ కోమాలోకి వెళ్లిపోయింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అల్లుడు వెంకట్రావుతో పాటు మరో ఇద్దరు తమపై దాడికి పాల్పడ్డారని పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News