Peddapalli District: డబ్బున్న వాళ్ల కోసం నిలబడే మోదీ ఓ ‘జీరో’: విజయశాంతి

  • పేదవాడి కోసం మోదీ పనిచేయట్లేదు
  • పేద ప్రజల కోసం ఉన్నది కాంగ్రెస్ పార్టీయే
  • ప్రజల తరపున నిలబడ్డ రాహుల్ గాంధీ ఓ హీరో

ప్రధాని మోదీపై టీ-కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షో లో ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిన మోదీ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పేదవాడి కోసం మోదీ పని చేయట్లేదని, డబ్బున్న వాడి కోసం పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు.

పేద ప్రజల కోసం ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రజల తరపున నిలబడ్డ వాళ్లెవరైనా హీరోనే అని, ఆ హీరో రాహుల్ గాంధీ అని కొనియాడారు. డబ్బున్న వాళ్ల కోసం నిలబడే మోదీ ఓ ‘జీరో’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ బీజేపీ లేదు కానీ, కేసీఆర్ ఉన్నారని, మోదీ, కేసీఆర్, జగన్, ఈ ముగ్గురూ ఒకటేనని అన్నారు. కేసీఆర్ కు ఓటేస్తే మోదీకి వేసినట్టేనని, మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే, ఆడవాళ్ల నగలను కూడా పట్టుకుపోతారని సెటైర్లు విసిరారు. గెలుపుపై ధీమాతో మోదీ ఉన్నారని, ఆయనకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు.

More Telugu News