Nagababu: వీళ్లకు ఏం తెలుసు నా గురించి? పనికిమాలిన వాళ్లు!: నాగబాబు ఆగ్రహం

  • నన్ను 'నాన్ లోకల్' అన్న సన్నాసి ఎవడు?
  • సొల్లు చెప్పడానికి తప్ప దేనికీ పనికిరారు
  • నేనే అసలైన 'లోకల్'

మెగా బ్రదర్ నాగబాబు ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు తనను 'నాన్ లోకల్' అంటూ తేలిగ్గా తీసిపారేయడంపై నాగబాబు రగిలిపోతున్నారు. "ఎవడు నాన్ లోకల్? ఏం తెలుసు ఈ వెధవలకి? యూస్ లెస్ ఫెలోస్" అంటూ ఓ ఇంటర్వ్యూలో నిప్పులు చెరిగారు.

"నేను పుట్టింది మొగల్తూరులో అయినా హైస్కూల్ నుంచి కాలేజ్ వరకు నరసాపురంలోనే చదివా. నా భార్యది కూడా పశ్చిమ గోదావరి జిల్లానే. ఈ జిల్లా అంతా తిరిగాను. మా నాన్నది కూడా పెనుగొండే. ఇవన్నీ తెలుసుకోకుండా సొల్లు మాటలు చెబుతున్నారు. ఎవడా సన్నాసి నన్ను నాన్ లోకల్ అన్నది? ఇంతకంటే పనికిమాలినతనం మరొకటి ఉంటుందా? నాపై పోటీచేస్తున్న రఘురామ కృష్ణంరాజు ఏమన్నా లోకల్ అభ్యర్థా? రోజుకో పార్టీ మారుతూ, పండుగలు, పబ్బాలు వస్తే బెట్టింగ్ బంగార్రాజులా వ్యవహారాలు చేసే సిగ్గులేనివాళ్లు" అంటూ విమర్శల వర్షం కురిపించారు.

అసలైన లోకల్ తానే అని, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేవాడు ఎవరైనా లోకలేనని నాగబాబు వ్యాఖ్యానించారు. తనను నాన్ లోకల్ అనే  రాస్కెల్స్ కంటే తానే మేలు అని పేర్కొన్నారు.

More Telugu News