vijayamma: కేసీఆర్ ను ఓడించండి అని చంద్రబాబు ఎందుకు రెచ్చగొడుతున్నారు?: విజయమ్మ

  • కేసీఆర్ కు ఏపీ ఎన్నికలతో ఏం సంబంధం ఉంది?
  • స్వలాభం కోసం చంద్రబాబు ఇంతలా దిగజారాలా?
  • 600 హామీలిచ్చి.. ఒక్కటీ నెరవేర్చలేదు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మండిపడ్డారు. ఏపీలో జరుగుతున్న ఎన్నికలకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు ఏపీతో సంబంధం లేకపోయినా... కేసీఆర్ ను ఓడించండి అంటూ చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వలాభం కోసం చంద్రబాబు ఇంతలా దిగజారిపోవాలా? అని అన్నారు. టీఆర్ఎస్ తో వైసీపీ పొత్తు ఉందని చంద్రబాబు అంటున్నారని... జగన్ ఎవరితో పొత్తు పెట్టుకోడని చెప్పారు. విజయనగరం జిల్లా గజపతినగరం రోడ్ షోలో మాట్లాడుతూ, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

విజయనగరం జిల్లా అంటే రాజశేఖరరెడ్డికి ఎంతో ప్రేమని... ఎందుకంటే రాయలసీమలా ఈ ప్రాంతం కూడా వెనుకబడిన ప్రాంతమని విజయమ్మ చెప్పారు. టీడీపీ పాలనలో ఈ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. తోటపల్లి నీరు రైతులకు అందడం లేదని చెప్పారు. గజపతినగరంకు నూరు పడకల ఆసుపత్రి రాలేదని... గోస్తని, చంపావతి నదుల అనుసంధానం జరగలేదని విమర్శించారు. అనుభవం ఉందని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... ఆరు వందల హామీలు ఇచ్చారని... ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమం తప్ప చంద్రబాబుకు మరేమీ పట్టదని దుయ్యబట్టారు.

More Telugu News