chandragiri: చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిధులివ్వలేదు : శ్రీవిద్యానికేతన్‌ సీఈఓ మంచు విష్ణు

  • మాపై ఆయన కక్ష సాధింపు ధోరణిలో భాగమే
  • 27 ఏళ్లుగా నిరుపేదలకు విద్యాదానం చేస్తున్న సంస్థ మాది
  • ఎప్పుడూ నాన్నగారు రాజకీయాలపై ఆసక్తి చూపలేదు

ఇరవై ఏడేళ్లుగా విద్యాదానం చేస్తున్న ‘శ్రీవిద్యానికేతన్‌’ సంస్థ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ఆపేశారని సంస్థ సీఈఓ, మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఆరోపించారు. చంద్రబాబు కక్షసాధింపు ధోరణిలో భాగంగానే ఇది జరిగిందన్నారు. నిన్నరాత్రి ఆయన చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి పంచాయతీలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో స్థానికులతో మాట్లాడారు.

దాదాపు మూడు దశాబ్దాలుగా విద్యాదానం చేస్తున్న తమ కుటుంబం ఏనాడూ రాజకీయాలపై ఆసక్తి చూపలేదని, అటువంటి తమ పట్ల చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు. కావాలనే మా విద్యా సంస్థలకు రావాల్సిన రూ.19 కోట్ల నిధులకు మోకాలడ్డి ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు.

శ్రీవిద్యానికేతన్‌ నెలకొల్పి చుట్టుపక్కల ఉన్న దాదాపు 2 వేల మందికి నాన్న మోహన్‌బాబుగారు ఉపాధి కల్పిస్తున్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ప్రాంతానికి ఏం చేశారో, ఎంతమందికి ఉపాధి కల్పించారో చెప్పాలన్నారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ లబ్ధిపొందేవారని, అటువంటి పాలన మళ్లీ రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయపడ్డారు. తొమ్మిదేళ్లుగా జనం మధ్య ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను అందుబాటులోకి తెచ్చారని, వాటిని అమలు చేస్తే రాష్ట్రం దూసుకుపోతుందన్నారు.

More Telugu News