Tamilnadu: కారు డోరులో నోట్ల కట్టలు.. కోట్ల రూపాయలు బయటపడటంతో విస్తుపోయిన అధికారులు!

  • తమిళనాడులోని పెరంబలూరులో ఘటన
  • కారు తలుపు లోపల రూ.2.1 కోట్ల నగదు
  • వీసీకే పార్టీ కార్యదర్శి కారులో తరలింపు

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ డబ్బును తరలించేందుకు నేతలు కొత్తదారులు వెతుకుతున్నారు. తాజాగా పోలీసుల తనిఖీకి చిక్కకుండా నగదును తరలించేందుకు ఓ రాజకీయ నాయకుడు కొత్త ప్లాన్ వేశాడు. కారు తలుపులో నగదును దాచాడు. అయితే కారును క్షుణ్ణంగా పరిశీలించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, ఆ నగదును పట్టుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని పెరంబలూరులో చోటుచేసుకుంది.

వీసీకే పార్టీ పెరంబలూరు మాజీ కార్యదర్శి ఈరోజు కారులో వెళుతుండగా, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో కారు డోర్ లోపల దాచిపెట్టిన రూ.2.1 కోట్ల నగదు బయటపడింది. దీంతో అధికారులు విస్తుపోయారు. సరైన పత్రాలు లేకుండా ఇలా దొంగచాటుగా తరలించడానికి యత్నించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు నగదును ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు.

More Telugu News