Mohanbabu: అసలు హెరిటేజ్ ఫుడ్స్ నాదే... తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకుని చంద్రబాబు కొట్టేశారు!: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

  • ఎక్కువ డబ్బు పెట్టింది నేనే
  • చంద్రబాబు, దాగాతో కలిసి స్థాపించాం
  • కెరీర్ పీక్ దశలో ఉండగా పట్టించుకోలేదు
  • మోసం చేసి వాటాలు కొట్టేశారు
  • దేవునిపై ఒట్టేసి నేను చెప్పగలను
  • చంద్రబాబు చెప్పగలరా? మోహన్ బాబు సవాల్

హెరిటేజ్ ఫుడ్స్ వ్యవస్థాపకుల్లో తాను కూడా ఉన్నానని, తన వద్ద నుంచి బ్లాంక్ పేపర్లపై సంతకాలు పెట్టించుకున్న చంద్రబాబు, తన వాటాను కొట్టేశారని నటుడు మోహన్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. తాను, చంద్రబాబు, దాగా అనే మరో మిత్రుడు కలిసి హెరిటేజ్ ని స్థాపించామని చెప్పిన మోహన్ బాబు, అధిక పెట్టుబడి తనదేనని, మిగతా ఇద్దరూ తక్కువ పెట్టుబడి పెట్టారని అన్నారు.

కొన్ని రోజుల తరువాత తెల్లకాగితాలపై సంతకాలు చేయమని అడిగారని, ఎందుకని ప్రశ్నిస్తే, అప్పట్లో ఏదో చెప్పారని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఆ సమయంలో హీరోగా టాప్ పొజిషన్ లో ఉన్న తాను, చాలా బిజీగా ఉన్నానని, స్నేహితుడే కదా అని చంద్రబాబును నమ్మి సంతకాలు చేశానని అన్నారు.

కొన్నేళ్ల తరువాత నాకు హెరిటేజ్ సంస్థతో సంబంధం లేదని చెప్పారని, ఈ విషయంలో తాను కోర్టుకు వెళితే, కేసు ఎంతోకాలం సాగిందని గుర్తు చేశారు. పరపతి ఉన్న చంద్రబాబును తట్టుకోలేమని ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు చెబితే, కేసును వదిలేశానని అన్నారు. తాను బయటకు వచ్చిన తరువాత దాగాను కూడా మోసం చేసి తరిమేశారని ఆరోపించారు.

ఈ కంపెనీ విషయంలో చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారని, రైతులకు తెలియకుండా వారి పేరిట హెరిటేజ్ లో వాటాలు కొని, వాటిని చంద్రబాబుకే అమ్మినట్టు చూపించి ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొట్టారని ఆరోపించారు. తనను మోసం చేసి హెరిటేజ్ నుంచి తరిమేశారన్న విషయాన్ని తిరుపతి, కాణిపాకం, విజయవాడ... ఎక్కడికి వచ్చి అయినా, ఒట్టేసి చెప్పగలనని, మోసం చేయలేదని చంద్రబాబు చెప్పగలరా? అని మోహన్ బాబు ప్రశ్నించారు.

More Telugu News