BSE: సెన్సెక్స్ సత్తా... నలభై ఏళ్ల క్రితం లక్ష... ఇప్పుడు నాలుగు కోట్లు!

  • సోమవారం నాడు 39 వేల మార్క్ ను తాకిన సెన్సెక్స్
  • టెక్నికల్ గా 1979, ఏప్రిల్ 1న జన్మించిన సెన్సెక్స్
  • 40 ఏళ్లలో 390 రెట్ల వృద్ధి

సోమవారం నాడు భారత స్టాక్ మార్కెట్ సూచిక సెన్సెక్స్ తొలిసారిగా 39 వేల మార్క్ ను తాకింది. సరిగ్గా 40 సంవత్సరాల క్రితం అంటే... 1979, ఏప్రిల్ 1న సెన్సెక్స్ సాంకేతికంగా జన్మించింది. 100 బేస్ వాల్యూ పాయింట్లతో తన పయనాన్ని ప్రారంభించిన సెన్సెక్స్, ఈ 40 ఏళ్ల వ్యవధిలో 390 రెట్లు పెరిగింది. మరోరకంగా చెప్పాలంటే నాడు సెన్సెక్స్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసుంటే, అది ఇప్పుడు రూ. 4 కోట్లకు సమానం. కచ్ఛితంగా చెప్పాలంటే రూ. 3.90 కోట్లన్నమాట.

సెన్సెక్స్ విలువ 1985లో 400 పాయింట్ల స్థాయిలో ఉండగా, అదే సంవత్సరం సెన్సెక్స్ చరిత్రలోనే అత్యధికంగా 94 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అదే సమయంలో 2008 సంవత్సరంలో 20 వేల స్థాయి నుంచి 50 శాతం కన్నా ఎక్కువగా పతనమై 9,600 పాయింట్లకు పడిపోయింది. స్టాక్ మార్కెట్ ను నమ్ముకుని ఉంటే ఇన్వెస్ట్ మెంట్ ఎంతగా పెరుగుతుందనడానికి సెన్సెక్స్ ఓ ఉదాహరణని పరాగ్ పరీఖ్ లాంగ్ టర్న్ ఈక్విటీ ఫండ్ మేనేజర్ రాజీవ్ టక్కర్ వ్యాఖ్యానించారు. ఈ 40 సంవత్సరాల్లో సెన్సెక్స్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇద్దరు ప్రధానుల హత్యలు, అణు బాంబుల పరీక్షలు, రెండు భారీ కుంభకోణాలు, ఓ యుద్ధం తదితరాలెన్నో మార్కెట్ ను ప్రభావితం చేశాయి. 9/11, 26/11 దాడులు కూడా మార్కెట్ ను అతలాకుతలం చేశాయి.

గడచిన నాలుగు దశాబ్ధాల్లో భారత ఆర్థిక వృద్ధి ఎంత గొప్పగా ఉందన్న విషయాన్ని స్టాక్ మార్కెట్ చూపిస్తోందని ఎటికా వెల్త్ మేనేజ్ మెంట్ ఎండీ అండ్ సీఈఓ గజేంద్ర కొఠారీ అభిప్రాయపడ్డారు. సంపద సృష్టిలో ఎన్నో మార్కెట్ల కన్నా ఇండియా ముందుందని ఆయన వ్యాఖ్యానించారు. ఏ ఇన్వెస్టర్ కైనా సంపద సృష్టిలో మార్కెట్ ముందుంటుందని, అయితే, మంచి కంపెనీలను ఎంచుకుని పెట్టుబడులు పెడితే, శీఘ్రగతిన రిటర్న్స్ పొందవచ్చని కొఠారీ సలహా ఇచ్చారు.

More Telugu News