KTR: కేటీఆర్, హరీశ్ మధ్య ఆసక్తకర చర్చ... ఎంజాయ్ చేసిన కార్యకర్తలు

  • టీఆర్ఎస్‌లో చేరిన సునీతా లక్ష్మారెడ్డి
  • గతంలో చేసిన సవాల్‌ను గుర్తు చేసుకున్న కేటీఆర్, హరీశ్
  • మెదక్ నుంచే భారీ మెజారిటీ వస్తుందన్న కేటీఆర్
  • క్రెడిట్ తనకు ఇవ్వాలన్న హరీశ్

నేడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. నేడు కేటీఆర్, హరీశ్ సమక్షంలో మెదక్ కాంగ్రెస్ నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గతంలో తమ ఇద్దరి మధ్య జరిగిన చర్చను కేటీఆర్, హరీశ్ గుర్తు చేసుకున్నారు. గతంలో మెదక్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ సాధించే విషయమై ఇద్దరూ సవాల్ చేసుకున్నారు.

మెదక్ నుంచి అత్యధిక మెజారిటీ వస్తుందని హరీశ్ పేర్కొనగా, కాదు కరీంనగర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మెదక్‌లో సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో అక్కడ ఆ పార్టీకి మరింత బలం చేకూరింది. దీంతో మెదక్ ఎంపీ స్థానం నుంచే అత్యధిక మెజారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని, నేడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఆ మెజారిటీలో తనకూ కొంత క్రెడిట్ ఇవ్వాలని హరీశ్ కోరారు. దీంతో అక్కడున్న కార్యకర్తలంతా వీరిద్దరి మధ్య సంభాషణను చూసి బాగా ఎంజాయ్ చేశారు.

More Telugu News