Mohan Babu: నిమ్స్ లో సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చీపుర్లతో తరిమికొట్టిన విషయం మోహన్ బాబు మర్చిపోయారా?: పంచుమర్తి అనురాధ

  • ఎయిర్ హోస్టెస్ తోనూ అసభ్యంగా ప్రవర్తించారు
  • ఆయనో అరాచకవాది
  • టీవీ చానల్ సిబ్బందిని రివాల్వర్ తో బెదిరించారు

ఇటీవల ఫీజు రీయింబర్స్ మెంట్ పేరిట ధర్నా చేసిన నటుడు మోహన్ బాబు ఆపై వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోహన్ బాబు సీఎం చంద్రబాబునాయుడ్ని టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పటి నుంచి వైసీపీ నేత హోదాలో ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దాంతో, టీడీపీ నేతలు మోహన్ బాబును లక్ష్యంగా చేసుకుని వరుసగా మీడియా సమావేశాలు పెట్టి ఏకిపారేస్తున్నారు. తాజాగా, పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ కూడా ఘాటుగా స్పందించారు. మోహన్ బాబు ఇవాళ వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నారని, లక్ష్మీపార్వతి అయితే ఆయన గురించి సరిగ్గా చెబుతారని అన్నారు.

పాతికేళ్ల కిత్రం నిమ్స్ లో సిబ్బందితో అమర్యాదకరంగా ప్రవర్తిస్తే చీపుర్లతో తరిమికొట్టిన విషయాన్ని మోహన్ బాబు మర్చిపోయారా? అంటూ నిలదీశారు. మోహన్ బాబు గతంలో ఓ ఎయిర్ హోస్టెస్ తోనూ అసభ్యంగా ప్రవర్తించారని అనురాధ ఆరోపించారు. అంతేకాకుండా, ఆయన కొడుకు లవ్ స్టోరీని ఓ టీవీ చానల్ ప్రసారం చేస్తే తుపాకీతో బెదిరించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. మోహన్ బాబు ఓ వలసపక్షి అని, అరాచకవాది అని విమర్శించారు.

More Telugu News