cuddapah: నేను చేసిన పనికి మీరిచ్చే కూలి నన్ను ఆశీర్వదించడమే: సీఎం చంద్రబాబు

  • కడప జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలి
  • ప్రతి ఇంటికి పెద్దకొడుకుగా ఉంటా.. మాట నిలబెడతా
  • ఈ జిల్లాలో కుట్రలు, కుతంత్రాలు పోవాలి

ఏపీ అభివృద్ధి కోసం తాను ఎంతగానో పని చేశానని, నిరంతరం పాటుపడ్డానని, ‘ఈ పనికి మీరిచ్చే కూలీ నన్ను ఆశీర్వదించడమే’ అని, ఈ ఎన్నికల్లో తమను గెలిపించాలని సీఎం చంద్రబాబునాయుడు కోరారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, కడప జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. ప్రతి ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని హామీ ఇచ్చానని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని అన్నారు. కడప జిల్లాలో డెయిరీ అభివృద్ధి చేస్తామని, జమ్మలమడుగులో చేనేత కార్మికులను ఆదుకుంటామని, సీపీఎస్ పై కేంద్రానికి లేఖ రాస్తామని, రద్దు చేసేందుకు సహకరిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా ‘అగ్రిగోల్డ్’ అంశం గురించి చంద్రబాబు ప్రస్తావించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని, వాటి ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. కడప జిల్లాలో కుట్రలు, కుతంత్రాలు పోవాలని, ఇక్కడి అభివృద్ధి పనులు ఊపందుకోవాలని ఆకాంక్షించారు. టీడీపీకి కడప జిల్లా ప్రజలు మద్దతుగా నిలబడాలని కోరారు.

More Telugu News