cuddapah: చంద్రబాబు ఏది చెబితే అది వినడమే నాకు తెలుసు: మంత్రి ఆదినారాయణరెడ్డి

  • రాయలసీమను అభివృద్ధి చేస్తాం
  • జగన్ కు పొరపాటున ఓటు వేయొద్దు
  • వైసీపీ గెలిస్తే రాష్ట్రం సర్వనాశనమైపోతుంది

చంద్రబాబు ఏది చెబితే అది వినడమే తనకు తెలుసని ఏపీ మంత్రి, టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, రాయలసీమను అభివృద్ధి చేయాలన్న తపన తమ నాయకులకు ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీపై ఆయన నిప్పులు చెరిగారు. జగన్ కు పొరపాటున ఓటు వేసి గెలిపిస్తే రాష్ట్రం సర్వనాశనమైపోతుందని అన్నారు. కత్తిపోటుకు, కత్తిగాటుకు తేడా ఏమిటో ప్రజలకు తెలుసంటూ జగన్ ని ఉద్దేశించి విమర్శలు చేశారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ, ఈ ఎంపీ గురించి జిల్లా ప్రజలందరికీ తెలుసని, జిల్లా అభివృద్ధికి ఆయన పాటుపడిన దాఖలాలు లేవని విమర్శించారు.

More Telugu News