Sangareddy District: టీఆర్ఎస్ కు ఓటేస్తే మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు వేసినట్టే: రాహుల్ గాంధీ

  • ఎన్నికల ముందు బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు
  • మోదీని కేసీఆర్ తిట్టడం పెద్ద డ్రామా
  • చౌకీదార్ మోదీ ‘దొంగ’ అని కేసీఆర్ ఎప్పుడైనా అన్నారా?

ఈ నెల 11న జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేస్తే మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు వేసినట్టేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు బీజేపీ, టీఆర్ఎస్ డ్రామా నడిపిస్తున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచార సభల్లో మోదీని కేసీఆర్ తిట్టడం, కేసీఆర్ ని మోదీ తిట్టడం ఒట్టి డ్రామాగా అభివర్ణించారు. చౌకీదార్ మోదీ ‘దొంగ’ అని కేసీఆర్ ఎప్పుడైనా అన్నారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మోదీపై రాహుల్ నిప్పులు చెరిగారు. నల్లకుబేరులపై చర్యలు తీసుకుంటామని, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామన్న మోదీ హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేశారని, పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెనక్కి రాలేదని విమర్శించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డ విషయాన్ని గుర్తుచేశారు.

More Telugu News